హైదరాబాద్ లోని దుర్గం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనాల రద్దీ తగ్గుతుందని కేటీఆర్ అభిప్రాయబడ్డారు.
నగరంలో మంత్రి కె.టి.ఆర్ ఆకస్మిక పర్యటన. తెలంగాణ భవన్ లో తన కార్యక్రమాలు ముగించుకొని ఆకస్మిక పర్యటన కి బయలుదేరిన మంత్రి కేటీఆర్ సుమారు గంటన్నరపాటు పర్యటించారు. రోడ్డు నెంబర్ 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు కాలినడకన ఫ్లైఓవర్ పనులతో పాటు సస్పెన్షన్ బ్రిడ్జి పనులను తనిఖీ చేేశారు. కార్యక్షేత్రంలోన్న వర్కింగ్ ఏజెన్సీల సిబ్బందితో పాటు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడిన మంత్రి సాధ్యమైనంత త్వరగా ఫ్లైఓవర్ మరియు సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని అధికారుల మధ్య సమన్వయం చేసుకొని ఇందుకు అవసరమైన కార్యాచరణ వేగవంతం చేయాలని సూచనలు చేేశారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు సోమవారం ఆకస్మికంగా పర్యటించి పలు ప్రాజెక్టుల పనులను తనిఖీ చేశారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం అకస్మాత్తుగా రోడ్ నెంబర్ 45 కు చేరుకున్న మంత్రి కేటీఆర్, ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం మీదుగా దుర్గం చెరువు పైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తంగా రోడ్ నెంబర్ 45 నుంచి ఇనార్బిట్ మాల్ వరకు కాలినడకన పనులను పరిశీలిస్తూ, అధికారులకు పలు సూచనలు ఇస్తూ గంటన్నరపాటు మంత్రి ఆకస్మిక పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం-45 లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ తో పాటు దుర్గంచెరువు పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. ఈ రెండు పనుల పురోగతిని అక్కడ పనిచేస్తున్న వర్కింగ్ ఏజెన్సీలతో పాటు అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ట్రాన్స్ కో విద్యుత్ లైన్ల తరలింపు, నూతన విద్యుత్ టవర్ల నిర్మాణం వంటి పెండింగ్ పనుల గురించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు. రెండు వారాల్లోగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేరకు విద్యుత్ లైన్లను తరలిస్తామని విద్యుత్ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సికి చెందిన ఎల్ అండ్ టి ఇంజనీర్లతో పనుల ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి అయినట్లు ఎల్ అండ్ టి ఇంజనీర్లు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నందున, సుందరీకరణ, లైటింగ్, పాదచారుల బాటల ఏర్పాటు పనులను మొదలుపెట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీకి సూచించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత దానికి అనుసంధానంగా రోడ్ నెం-45 వరకు చేపట్టిన రోడ్ పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సిని, అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పూర్తి అయితే పశ్చిమ హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని మంత్రి కె.టి.ఆర్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జితో హైదరాబాద్ నగరానికి మరింత గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, శాసన సభ్యులు అరికెపూడి గాంధీ, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
అనంతరం హైటెక్ సిటీలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్ లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈమేరకు హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ వద్దకు చేరుకున్న మేయర్ బృందం అక్కడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కూకట్పల్లి ప్రాంత ప్రజలకు ఈ బ్రిడ్జితో లబ్ది కలుగుతుందని పేర్కొన్నారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్ కు మేయర్ తెలిపారు. తదనంతరం పనులు నడుస్తున్న తీరుని మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.