కరోనాపై యుద్ధమే CM జగన్మోహన్.
కోవిడ్–19 వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దయచేసి ఎక్కడి వారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేసారు. కేవలం 3 వారాల పాటు ఇళ్లలో ఉండాల్సిందే అప్పుడే ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడతాం. దయచేసి అర్ధం చేసుకోమని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి వ్యాధులు 100 ఏళ్లకు ఒకసారి కూడా వస్తాయో? రావో? మన జనరేషన్లో చూస్తామో? లేదో? దీన్ని కేవలం క్రమశిక్షణతోనే నివారించగలం. నిర్లక్ష్యం చేస్తే ఏం జరిగిందో కొన్ని దేశాల్లో చూశాం
కఠిన నిర్ణయాలు తప్పవు
రాష్ట్రంలో కరోనా కట్టడికి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోతే, అనర్థం జరుగుతుందన్న భయం కూడా ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. నిన్న రాత్రి జరిగిన కొన్ని ఘటనలు మనసును కలిచి వేశాయి. మన వాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదని బాధనిపించింది. కానీ అందరం ఒక్కసారి ఆలోచన చేయాలి
ఇవాళ అందరం ఇళ్లకే పరిమితం కాకపోతే వ్యాధిని అదుపు చేయలేం. ఇవాళ కూడా పొందుగుల, దాచేపల్లి, నాగార్జునసాగర్ సరిహద్దుల్లో ఇదే పరిస్థితి. ఒకసారి ప్రదేశం మారితే, వారు ఎందరితోనో కాంటాక్ట్లోకి వస్తున్నారు వారు ఇంకా ఎంత మందితో కలిసి వెళ్తారో తెలియదు అలాంటి వారిని పట్టుకోవడం గుర్తించడం చాలా కష్టము. ఏప్రిల్ 14 వరకు మనం ఎక్కడికీ వెళ్లకుండా, ఇళ్లలోనే ఉంటే, కాంటాక్ట్ ట్రేసింగ్ ఈజీగా తెలుస్తుంది. వ్యాధి సోకిన వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కానీ, ఇక్కడ కూడా ఒక ఊరి నుంచి మరో ఊరుకు పోవద్దు. మూడు వారాల పాటు నియంత్రణ పాటించండి
ఎక్కడి వారు అక్కడే ఉండమని కోరుతున్నాను. మన వాళ్లను మనమే ఆపాల్సి రావడం బాధనిపిస్తోంది. నిన్న కూడా 44 మందిని, మార్కాపూర్, కందుకూరు వద్ద 152 మందిని అనుమతి ఇచ్చాం. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు. ఎందుకంటే వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారో తెలియదు
వారిని మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చినా వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచక తప్పదు కాబట్టి పరిస్థితి అర్ధం చేసుకోండి. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుతో మాట్లాడాను. ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఎవరికి అవసరమైనా కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే, వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. కేసీఆర్ ఎంతో ఆప్యాయత చూపారు అందరినీ తాను చూసుకుంటానని చెప్పారు
AP రాష్ట్రంలో ఎన్ని కేసులు
రాష్ట్రంలో ఇప్పటికి 10 కేసులు పాజిటివ్గా తేలాయి, వదిలేస్తే అది ఎంత వరకు పోతుందో తెలియదు. ఈ 10 కేసులు పెరగకుండా ఉండాలంటే అందరూ సమష్టిగా కృషి చేయాలి
విదేశాల నుంచి ఎందరొచ్చారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని సర్వే చేసి ట్రాక్లో పెట్టడం జరిగింది. మొత్తం 27,819 మంది రాగా, వారిని నిఘాలో పెట్టాం. వారు ఎందరితో కాంటాక్ట్లో ఉన్నారో.. వారు ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారో ఆలోచించాలి. గ్రామ స్థాయిలో వాలంటీర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్ల కృషి హ్యాట్సాఫ్. ఎవరూ చేయని పని వారు చేస్తున్నారు. అందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంటింటికి తిరిగి సర్వే ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేయడం వల్లనే కేవలం 10 కేసులకే పరిమితం కాగలిగాం. ఇదే సమయంలో మనమూ స్వయం క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఇబ్బంది పడతాం. రాష్ట్రంలో
విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రుల ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లతో పాటు, అదనపు బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి జిల్లాలో 200 బెడ్లతో చికిత్స కేంద్రాలు (క్వారంటైన్ సెంటర్లు) ఏర్పాటు అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు సెక్టార్లో కూడా వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని విధాలుగా సిద్థంగా ఉన్నాం.
APలో 1902 హెల్ప్లైన్
రాష్ట్రంలో ఎవరికి ఏ రకమైన అవసరం ఉన్నా, ఇబ్బంది వచ్చినా కాల్ చేయండి. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుతో పాటు, మరో 10 మంది ఉన్నతాధికారులను కలుపుకుని ఈ అత్యవసర నెంబరును ఏర్పాటు చేశాం. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలకు 104 నెంబర్ కూడా అందుబాటులో ఉంది.
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు.
రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటులో పర్యవేక్షణ చేసేందుకు పదిమంది సీనియర్ అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు. ప్రతి జిల్లాలో మంత్రులు జిల్లా కంట్రోల్ రూమ్లలో భాగస్వాములవుతారు. అక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు. ఎవరికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా వారు చూస్తారు. ఎవరికీ ఏ లోటూ ఉండదు.
ఎవరికీ ఆహారం, వసతి ఇతర సౌకర్యాల లోటు లేకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా 1902 కు ఫోన్ చేయండి. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అవుతారు. మీ సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి ఎక్కడికి కదలకండి. సరుకుల రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ప్రజల సంఖ్య, వారి అవసరాలు గుర్తించి కేవలం 2 నుంచి 3 కి.మీ పరిధిలో రైతు బజార్లతో పాటు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి అవసరమైనవి తీసుకుని, ఆ తర్వాత ఇళ్లలోనే ఉండండి.
రైతులు సామాజిక దూరం పాటించాలి.
రాష్ట్రంలో పంటలు కోతకు వస్తున్నాయి. కాబట్టి రైతులకు మినహాయింపు తప్పదు అనుకుంటే రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లండి. కానీ అక్కడ తప్పనిసరిగా సామాజిక దూరం ఉండేలా చేయమని విజ్ఞప్తి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం. పంచాయతీ రాజ్, పురపాలక పరిపాలన శాఖలకు నిర్దేశించాం.రేషన్ సరుకులు–ఆర్థిక సహాయం అందరికి అందుతాయి.
బియ్యం, పప్పు ఈనెల 29 నుంచి రేషన్ షాపుల్లో అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 4న ప్రతి కుటుంబానికి
రూ.1000 డోర్ డెలివరీ చేస్తాం. ఇలాంటి పరిస్థితి 100 ఏళ్లకు ఒకసారి కూడా వస్తుందో లేదో తెలియదు. కాబట్టి అందరం కలిసి పని చేయాలి. ప్రభుత్వం నుంచి ఏ లోటూ రాకుండా చూస్తాం. మరొక్కసారి విజ్ణప్తి చేస్తున్నా, మూడు వారాల పాటు ఎక్కడివారు అక్కడే ఆగిపోండి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.