కరోనా జనాలను బందీ చేస్తోంది. అడుగు బయటకు పెట్టనీయడం లేదు. సో ఇళ్లలోనే ఉంటున్న వారికి మొబైల్, టీవీలే టైంపాస్. అయితే వీటిలో కూడా అన్నీ కరోనా వార్తలే. మొబైల్ చూసినా టీవీ ఆన్ చేసినా కరోనా వైరస్ సమాచారం భయం గుప్పిట్లోకి నెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ చింతతో మానసికంగా కుంగిపోతున్న మహిళల్లో ఉత్సాహాన్ని నింపడానికి సామాజిక మాధ్యమంలో ‘చీరకట్టు’ చాలెంజ్ ప్రకటించారు. అసలేంటంటే నచ్చిన చీర ధరించి ఫొటో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చాలెంజ్కు విపరీత స్పందన వస్తోంది. మహిళలు చీర ధరించి ఫుల్ సోలో ఫొటోలను షేర్ చేస్తూ మరికొంత మందికి ట్యాగ్ చేసి సవాల్ స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. లాక్ డౌన్ లో మహిళలందరూ చీరకట్టుతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. కరోనా పోస్టులతో కలవరం చెందేవారికి ఫొటో పోస్టులు కొంత ఉపశమనం కలిగించేలా ఉన్నాయంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చీరకట్టు ఛాలెంజ్ లో పాల్గొంటున్న మహిళలు నెగిటీవ్ నుంచి పాజిటీవ్ మూడ్లోకి వచ్చి హ్యాపీగా ఉంటున్నారట.