ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగు నీరు, నాడు-నేడు కింద కార్యక్రమాలు, హౌసింగ్, పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు, ఉపాథి హామీ కార్యక్రమాలు, కోవిడ్–19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
కోవిడ్–19 పరీక్షలు:
కోవిడ్–19 టెస్టుల పరంగా చూస్తే మనం దేశంలోనే నెంబర్ వన్, ప్రతి పది లక్షల జనాభాకు 2500కి పైగా టెస్టులు మనం చేస్తున్నాం ఇదో రికార్డు. 35–36 రోజుల కింద మనకు స్విమ్స్ తప్ప మరో చోట టెస్టింగ్ ఫెసిలిటీ లేదు. అది కూడా 2 రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవి. కానీ ఇవాళ 11 జిల్లాల్లో 12 టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ట్రూనాట్ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయి. అందరూ కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నాం. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్వర్క్ఉంది. కోవిడ్ను ఎదుర్కొనే విషయంలో మనం ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా పని చేయగలిగాం. కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరును చూపుతున్నారని అభిప్రాయబడ్డారు. కోవిడ్19 వాస్తవ పరిస్థితి:
ఎంత చేయాలనుకున్నా కోవిడ్ అనేది ఎక్కడో చోట కనిపిస్తుంది, కోవిడ్19తో కలిసి జీవించాలన్నది వాస్తవమైన విషయం. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇది కనిపిస్తుంది. దగ్గడమో, తుమ్మడమో చేస్తే.. అది పక్కవాళ్లకు వ్యాపిస్తుంది. కోవిడ్ అన్నది జీవితంలో భాగం అవుతుంది. కరోనా వైరస్ కారణంగా మరణాల రేటు కేవలం 2 శాతం లోపే ఉంది. వయస్సు ఎక్కువగా ఉన్న వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి పైనే ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. మన ఇంట్లో ఉన్న మన పెద్దవారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్తో కలిసి జీవించాల్సి ఉంటుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుని అడుగులు ముందుకు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
ప్రతి గ్రామంలో 10 క్వారంటైన్ బెడ్లు:
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు తిరిగి వస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా కొంత మంది వెళ్లడం ప్రారంభం అయ్యింది. లక్షకు పైగా రాష్ట్రానికి వలస కూలీలు వస్తారని అంచనా. వారు కాకుండా మిగిలిన వారు మరో లక్ష మంది ఉంటారని అంచనా. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చెందిన వారు రానున్నారు. వీటన్నింటినీ మనం డీల్ చేయాల్సి ఉంటుంది. అందుకనే స్థిరంగా మనం జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ప్రతి గ్రామంలో క్వారంటైన్ సదుపాయం:
ప్రతి గ్రామంలో 10 మందికైనా సరి పడే విధంగా క్వారంటైన్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది. క్వారంటైన్లో మంచి బెడ్లు, బెడ్షీట్లు, దిండ్లు, టాయిలెట్లు, మంచి భోజనం కూడా పెట్టాలి. క్వారంటైన్ వద్ద పారిశుద్ధ్యం కూడా ఉండాలి.శానిటేషన్ వర్కర్లను కూడా పెట్టాలి. ప్రతి గ్రామంలోనూ ఈ సదుపాయాలు ఉండాలి. దాదాపు 11వేలకుపైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసంగా లక్ష మందికి క్వారంటైన్ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ క్వారంటైన్ సదుపాయాలు ఉన్నాయి. 25 వేల సింగిల్ రూమ్స్, 7500 డబుల్రూమ్స్ ఉన్నాయి. వాటిలో 40 వేల మంది వరకూ ఉండొచ్చు. ఇవి కాకుండా డార్మిటరీస్ కూడా ఉన్నాయి.
ఇక్కడ కూడా సదుపాయాలు బాగున్నాయా? లేదా? అన్న విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్ష, పర్యవేక్షణ చేయాలి: టాయిలెట్లు ఉన్నాయా? లేదా? అన్నది చూడాలి.
ఈ ప్రక్రియ అంతా మన జీవితంలో కొన్ని నెలల పాటు కొనసాగుతుంది. నిరంతరంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. అందుకనే జాగ్రత్తలు తీసుకోవాలి. సదుపాయాలు బాగుంటేనే.. ప్రజలు అక్కడకు వెళ్లగలుగుతారు. అందుకనే సదుపాయాలు బాగుండేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉంటుంది:
సదుపాయాలు లేకపోతే కలెక్టర్ మీద మచ్చ పడుతుంది. సిబ్బందిని పెట్టుకుని క్వారంటైన్ సదుపాయాలపై దృష్టి పెట్టండి, ప్రతి రోజూ సమీక్ష చేయండి.
టెలి మెడిసిన్:
టెలి మెడిసిన్ కోసం ఒక నంబర్ కేటాయించాం, అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన నెంబర్లు.. టెలి మెడిసిన్, దిశ, అవినీతి నిర్మూలన, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన నెంబర్లు ఉండాలి. టెలి మెడిసిన్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అధికారులు చెప్తున్నారు.
కాల్ చేసిన వారికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితోపాటు, కలెక్టర్కూ వస్తాయి: ఇక్కడ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. పీహెచ్సీ పరిధిలోకి ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలి. 24 గంటల్లోగా ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వెళ్లాలి. త్వరలో విజేల్ క్లినిక్లు కూడా ప్రారంభం అవుతాయి. అప్పుడు టెలీ మెడిసిన్ మరింత బలోపేతం అవుతుంది.
ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పని చేయించాలి. కుటుంబ సర్వే. పరీక్షలు. అలాగే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశారు. అ కుటుంబాలలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు. ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలి.
కంటైన్మెంట్ క్లస్టర్లు:
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. నిర్దేశించుకున్న కంటైన్మెంట్ క్లస్టర్లపై దృష్టి పెట్టాలి. కంటైన్మెంట్ క్లస్టర్, దాని చుట్టూ ఉన్న బఫర్ జోన్పై పూర్తి దృష్టి పెట్టాలి. కరోనా పాజిటివ్ కేసులన్నీ కూడా క్లస్టర్ జోన్ల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. కంటైన్మెంట్ క్లస్టర్ల వెలుపల కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ అన్నారు.
మద్యం విక్రయాలు:
లిక్కర్కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతోంది అన్న విషయాన్ని టీవీ ఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి ధరలు 75 శాతం పెంచాలి. మనం 25 శాతం ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గించాలనుకుంటే ఢిల్లీలో ఏకంగా 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం. దుకాణాల సంఖ్య కూడా 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాము. దీనివల్ల మనం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోపు 33 శాతం దుకాణాలు తగ్గించినట్టు అవుతుంది. ఇప్పటికే 20 శాతం దుకాణాలు తగ్గించాం. కాబట్టి మొత్తం 15 నెలల కాల వ్యవధిలో మద్యం దుకాణాలు 33 శాతం తగ్గించినట్టు అవుతుంది. ప్రతి షాపు వద్దా ఇంతకు ముందు ప్రైవేటు రూమ్స్ (పర్మిట్ రూమ్స్) పెట్టారు. మనం వాటిని రద్దు చేశామని, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టుషాపులను కూడా రద్దు చేశాంమని, గ్రామాల్లో బెట్లుషాపులు పర్మినంట్గా లేకుండా ఉండాలంటే.. అది లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుందని అన్నారు.
అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. లేకపోతే సేల్స్ను ప్రోత్సహించడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టుషాపులను ప్రోత్సహిస్తారు. అంతే కాకుండా మద్యం విక్రయించే వేళలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంట వరకూ పరిమితం చేశాం. అందులో భాగంగానే ఈ 75 శాతం ధరల పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం. రేట్లు షాక్ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలు తగ్గించుకుంటూ పోతాం.
కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యత:
దీని వల్ల పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా, అలాగే రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది: దీని కోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. లిక్కర్, ఇసుక మీద కలెక్టర్లు, ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్ స్టాఫ్ మాత్రమే ఏమీ చేయలేదు. వారి సంఖ్య చాలా తక్కువ.
పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలి. అక్రమ మద్యం రవాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లుకు, ఎస్పీలకు గట్టిగా చెప్తున్నా, ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, ఈ అంశాలను దగ్గరుండి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీమీద పూర్తి విశ్వాసం ఉంది, వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఇవ్వడకూడదు.